ఓ సినిమా ప్రకటించి దాన్ని పూర్తి చేయకముందే మరో సినిమాను ప్రకటించాడు. మొదటి సినిమా గురించి ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభించకనే లేదు ఇంకో సినిమాను ప్రకటించాడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి. వర్మ స్టైల్ మాదిరి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ తీస్తానని ప్రకటించి వార్తల్లో నిలిచాడు. ఈ సినిమా విషయంలో ఆయన మొదట్నుంచి వ్యహరిస్తున్న తీరు జనాలకు చిరాకు తెప్పిస్తోంది.
ఇంతకుముందు ఈ కేతిరెడ్డి తీసినవన్నీ బి-గ్రేడ్ సినిమాలే. ఇప్పుడు ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాపై హడావుడే తప్ప సినిమా ముందుకు తీసుకెళ్లాడు. ఎన్టీఆర్ ఘాట్లో.. ఆ తర్వాత ఎన్టీఆర్ పుట్టిన ఊరులో పబ్లిసిటీ చేశాడు తప్పితే షూటింగ్ చేయలేదు. ‘విశ్వరూపం’ భామ పూజా కుమార్ లక్ష్మీపార్వతి పాత్ర చేస్తుందని ప్రకటించాడు. ఆ తర్వాత ఆ సినిమాపై సప్పుడు లేదు. ఈ సినిమా సంగతి ఎటూ తేలకుండానే కేతిరెడ్డి ఇప్పుడు మరో సినిమా అనౌన్స్ చేశాడు. దివంగత తమిళనాడుముఖ్యమంత్రి జయలలిత.. ఆమె స్నేహితురాలు శశికళ జీవితాల ఆధారంగా ఆయన ‘శశిలలిత’ అనే సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. జయలలిత మరణానికి సంబంధించి అసలేం జరిగిందో ఈయన తన సినిమాలో చూపిస్తాడట.