బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొంది మహానటిగా కీర్తి గడించిన నటి సావిత్రి. ఆమె జీవితాధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మహానటి’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగి బుధవారంతో ( మార్చి 21) షూటింగ్ పూర్తయ్యింది. మహానటి సావిత్రి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం షూటింగ్ పూర్తయ్యిందని చిత్ర బృందం ప్రకటించింది. సోషల్ మీడియాలో ఆ ఫొటో షేర్ చేసి షూటింగ్ పూర్తయిందని తెలిపారు.
ఈ సినిమాలో కీర్తి సురేశ్ సావిత్రి పాత్రలో నటిస్తుండగా, సమంత విలేకరిగా, సావిత్రి భర్త జెమిని గణేశన్గా దుల్కర్ సల్మాన్, ఇంకా విజయ్ దేవరకొండ, షాలిని పాండే, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, మోహన్బాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి మే 9వ తేదీన సినిమా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ నిర్మాతగా సినిమాను నిర్మిస్తున్నారు.