పోటీ అంటే సమవుజ్జీల మధ్య జరిగితేనే రంజుగా ఉంటుంది. అప్పుడే ఎవరి సత్తా ఏంటో తెలిసేది. త్వరలో అలాంటి హోరా హోరి పోటికి రంగం సిద్దమవుతోంది.
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా దాదాపు 100కోట్ల పై చిలుకు బడ్జెట్తో సిద్దమవుతోన్న బాహుబళి చిత్రాన్ని జులై 10వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే విడుదల తేదీని మార్చినందుకు బాధపడుతోన్న బాహుబళి టీమ్ ఎట్టి పరిస్థితిల్లో జులై 10న సినిమాను విడుదల చేయడానికి రెడీ అవుతోంది.
అదే సమయంలో వరుసగా రెండు ప్లాప్స్తో ఆగడు, నేనొక్కడినే చిత్రాల ద్వారా తన అభిమానులను కూడా భారీగా నిరాశపరిచిన టాలివుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సారైనా రెండు ప్లాప్లకు మించిన హిట్ కొట్టాలనే కసితో కొరటాల డైరెక్షన్లో శ్రీమంతుడు మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని జులై 17న రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మరి రెండు వరుస వారాలలో భారీ చిత్రాలు పోటీ పడితే అందులో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ఉండటం సహజం.
కానీ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం మహేశ్ బాబే ఆ తేదీని వాయిదా వేయించి మరో వారం పోస్ట్పోన్ చేయించి, బాహుబళి కి రెండు వారాల గ్యాప్ తీసుకున్న తర్వాత రిలీజ్ చేద్దామనే యోచనలో ఉన్నాడని సమాచారం. ఇలా కాకుండా జులై 17 నే రిలీజ్ చేస్తే ఇద్దరు టాప్ హీరోలలో ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ అటు ప్రభాస్ ఫ్యాన్స్లోనూ ఇటు మహేశ్ బాబు ఫ్యాన్స్లోనూ తారా స్థాయికి చేరుకుంటోందని సమాచారం.