పవర్స్టార్ పవన్కల్యాణ్ అంటే అందరికీ ఇష్టమే. ఆయన నటన, వ్యక్తిత్వం పరంగా ఎంతోమంది అభిమానిస్తున్నారు. పవన్ అంటే సినీ పరిశ్రమకు చెందినవారు కూడా అభిమానం చూపిస్తున్నారు. నితిన్ బాహాటంగానే పవన్పై వీరాభిమానం చూపిస్తుంటాడు. నితిన్ మాదిరిగా బయటకు చెప్పకున్నా చాలామంది పవన్ను అభిమానిస్తున్నారు. అయితే ప్రిన్స్ మహేశ్బాబు సోదరి మంజులకు కూడా పవన్ అంటే ఇష్టమంట. ఈ విషయాన్ని తాను దర్శకత్వం చేసిన ‘మనసుకు నచ్చింది’ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు.
సినిమా గురించి మాట్లాడుతూ.. పవన్కల్యాణ్ గురించి మాట్లాడారు. ‘నాన్న (సూపర్ స్టార్ కృష్ణ), తమ్ముడు మహేశ్ తరువాత తాను ఎక్కువగా అభిమానించే వ్యక్తి పవన్కల్యాణ్’ అని ప్రకటించారు. పవన్లోని నిజాయతీ తనకు బాగా నచ్చుతుందని.. ఆయన కోసం తాను ఒక కథ రాసుకున్నాను.. అని ఆశ్చర్యకరమైన విషయం తెలిపారు. రాసుకున్న కథకి ‘పవన్’ అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేశానని ప్రకటించారు. తాను రాసిన కథ పవన్కల్యాణ్ వినాలేగానీ పవన్కు తప్పకుండా నచ్చుతుందనే ధీమా వ్యక్తం చేసింది. తన కథ ఒకసారి వినమని మీరైనా చెప్పండి అని మీడియాను కోరింది.
ప్రస్తుతం ఆమె దర్శకత్వం చేసిన ‘మనసుకు నచ్చింది’ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్, అమైరా దస్తూర్ నటిస్తున్నారు. ఈ సినిమా విజయం సాధిస్తుందని మంజుల ధీమాగా ఉన్నారు. ఈ సినిమాతో సినీ పరిశ్రమలో చురుగ్గా ఉండాలని భావిస్తున్నారు.