ఒక్కోసారి మంచి చేయబోతే .. చెడు ఎదురవుతూ ఉంటుంది. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసేందుకు ప్రయత్నించి.. మనం కష్టాల్లో పడుతూ ఉంటాం. సోషల్ మీడియాలో ఛాన్స్ దొరికితే చాలు ట్రోల్ చేసే వాళ్లు కోకొల్లలు.. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే… స్టార్ డైరెక్టర్, బాహుబలి సృష్టికర్త ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆయన చేసిన ఓ పని..సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొందరు రాజమౌళి పెద్ద మనసుకు ఫిదా అయితే మరికొందరు..ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. విషయంలోకి వెళితే.. బాహుబలి చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కో–ఆర్డినేటర్గా పని చేసిన దేవిక అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని ఆమెకు సాయం చేయాలంటూ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.
దేవికకు సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు. దురదృష్టవశాత్తు ఆమె బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. దయచేసి ఆమెకు సాయం చేయడానికి ముందుకు రండి అంటూ ట్వీట్ చేశారు. దేవిక దీన గాథకు అక్షర రూపం ఇచ్చారు. ట్విటర్ లో ఆమె కష్టాలను వివరించారు. దేవిక ఓ మధ్య తరగతి మహిళ. ఓసారి క్యాన్సర్తో బాధపడి కోలుకున్నారు. ఆమె పెద్ద కుమారుడు అరుదైన వ్యాధితో బాధ పడుతున్నాడు. కుటుంబ పోషణ, కుమారుడి వైద్యం ఖర్చుల కోసం దేవిక, ఆమె భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేసేవారు. కానీ విధికి కన్నుకుట్టింది. కిడ్నీ సమస్యతో భర్త మరణించారు. దాంతో కుటుంబ బాధ్యత మొత్తం తనపై పడింది. ఉరిమి లేని పిడుగులా ఆమెపై రెండోసారి క్యాన్సర్ దాడి చేసింది. చికిత్సకు సుమారు రూ. 3 కోట్లు ఖర్చవుతోంది. ఓ ఆన్లైఫ్ క్రౌడ్ ఫండింగ్ సంస్థ దేవికకు సాయం చేయడానికి ముందుకొచ్చి ఆమె కథను ప్రచురించింది.
ఈ విషయం తెలుసుకున్న రాజమౌళి దేవిక పరిస్థితిని వివరించి సాయం చేయాలని కోరారు. అయితే రాజమౌళీ ట్వీట్ను కొందరు పాజిటివ్గా తీసుకుంటే మరికొందరూ నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు తీస్తూ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే మీరు సాయం చేయకుండా ఇలా డొనేషన్లు అడుగుతారా? మీ సినిమాల్లో చూపించే ఎమోషన్స్ మీకు లేవా? ముందు మీరెంత ఎంత సాయం చేశారో చెప్పి తర్వాత ఇతరులను సాయం అడగిండి అని ఓ నెటిజన్ రాజమౌళిపై కామెంట్ చేశారు.
Also Read: యాంకర్ అనసూయ క్షమాపణలు