సూపర్స్టార్ రజినీకాంత్ సినిమా విడుదల అవుతుందంటే చాలు ఇండియా మొత్తం రజినీ ఫివర్తో ఊగిపోతుంది. అయితే రజినీకాంత్ నటించిన గత రెండు సినిమాలు సరైన విజయాలు సాధించలేదు. రోబో తరువాత రజినీకి హిట్ లేదు. దీంతో రజినీ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక రోబోకు సీక్వెల్గా తెరకెక్కుతున్న 2.0 సినిమాపై తలైవా అభిమానులు చాలానే ఆశలు పెట్టుకున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2.ఓ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతుంది.
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల డైరెక్ట్ సినిమా కంటే ఎక్కువ అంచనాల నడుమ విడుదల అవుతోంది. 2.ఓ హడావుడి ముగిసిన వెంటనే ‘పేట్ట’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రం షూటింగ్ సమ్మర్ లోనే ప్రారంభం అవ్వడంతో వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. ‘పేట్ట’ చిత్రం షూటింగ్ శరవేంగా దర్శకుడు కార్తీక్ పూర్తి చేసి జనవరిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే జనవరి అంటున్నారు కాని – ఎలాగూ పేట్ట వాయిదా పడటం ఖాయమని అనుకున్నారు. రజినీకాంత్ ఏ సినిమా కూడా ఈమద్య కాలంలో ముందుగా ప్రకటించిన తేదీకి రాలేదు. అలాగే పేట్ట కూడా రాదని అంతా అనుకున్నారు. కాని రజినీకాంత్ సంక్రాంతి బరిలో దిగబోతున్నట్లుగా మరోసారి చిత్ర యూనిట్ సభ్యుల నుండి అధికారిక క్లారిటీ వచ్చింది.
రజినీ ఎలాగూ జనవరిలో రాడనుకుని పలు సినిమాలు సంక్రాంతికి – రిపబ్లిక్ డే కు విడుదలకు సిద్దం అవుతున్నాయి. తమిళంతో పాటు తెలుగు సినిమాలు కూడా ‘పేట్ట’ వల్ల ఇప్పుడు ఇబ్బంది ఎదుర్కోబోతున్నాయి. రజినీకాంత్ మూవీ అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మరో వైపు సంక్రాంతికి పెద్ద సినిమాలైన ‘వినయ విధేయ రామ’ – ‘ఎఫ్ 2’ – ‘ఎన్టీఆర్’ కథానాయకుడు’ ఇంకా పలు చిన్నా పెద్ద చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పుడు ఈ చిత్ర మేకర్స్ షాక్ కు గురవుతున్నారు. రజినీ వస్తే పరిస్థితి ఏంటా అని వారు ఆందోళన చెందుతున్నారు. తెలుగులో కాస్త ఆలస్యంగా విడుదల చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని తమిళం మరియు తెలుగులో రజినీకాంత్ సినిమాలు ఒకే సారి విడుదల అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ఈసారి కూడా అక్కడ – ఇక్కడ కూడా ఒకేసారి అదే పొంగల్ కు రజినీ రంగంలోకి దిగడం ఖాయం. ఇక్కడ సినిమాల షెడ్యూల్స్ అంత గందరగోళం అవ్వడం పక్కా అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.