అలనాటి బాలీవుడ్ నటి, సల్మాన్ ఖాన్ హీరోయిన్ పూజా దడ్వాల్ పరిస్థితి దయనీయంగా ఉంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అత్యంత దీన స్థితిలో ఉన్నారు. కొంతకాలంగా క్షయ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో బతుకు పోరాటం చేస్తున్నారు. కనీసం కప్పు టీ కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేని దీన స్థితిలో ఉన్నట్లు తెలిపారు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా 1995లో రిలీజైన ‘వీర్గతి’ చిత్రంలో నటించింది దడ్వాల్ . తనకు టీబీ సోకిందని ఆరు నెలల కిందట వైద్యులు నిర్థారించారని ఆమె చెప్పింది. ఈ విషయం తెలియగానే తన భర్త, కుటుంబం తనను వదిలేశారని ఆమె వాపోయింది. గత పదిహేను రోజులుగా ముంబైలోని సెవ్రీలో ఉన్న టీబీ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. అయితే ఒంటరిగా ఉన్న తనను ఆదుకునే వారు ఎవరూ లేరని, చికిత్స చేయించుకునే స్థోమత కూడా తనకు లేదని, సాయం కోసం సల్మాన్ను కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదని ఆమె తెలిపింది.
చాలా ఏళ్లపాటు గోవాలో క్యాసినో నడిపించానని, ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, కనీసం ఓ కప్పు టీకి కూడా ఇతరులపై ఆధారపడుతున్నానని ఆమె తన దయనీయ స్థితి గురించి వివరించింది. హిందుస్థాన్, దబ్దడా, ఇంతెక్వామ్, సింధూర్ కీ సౌగంధ్ సినిమాల్లోనూ పూజ నటించారు. ఈ వీడియో చూసైనా సల్మాన్ నా గురించి తెలుసుకుని సాయం చేస్తారని ఆశిస్తున్నా’ అని ఆమె అన్నారు.