మద్రాస్ నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్ రావడానికి దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోవడంతో సినీ పరిశ్రమ గందరగోళంలో ఉంది. ఏపీకి తీసుకురావాలని టీడీపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. దానికి తగ్గ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ అంతా హైదరాబాద్కు బై బై చెప్పేసి విశాఖపట్టణం, విజయవాడ, రాజమండ్రి బాట పడుతున్నారు.
సినిమా ఫంక్షన్స్ అంటే ఇప్పటివరకూ హైదరాబాద్ బ్రాండ్గా ఉండేది. ఇప్పుడు మాత్రం ఏపీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద హీరోలంతా హైదరాబాద్ను వదిలేసి తమ సినిమా కార్యక్రమాలన్నింటిని ఆంధ్రప్రదేశ్కు తీసుకెళ్తున్నారు. రామ్చరణ్ నటించిన ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో నిర్వహించారు.
ఇప్పుడు అదే బాటన మహేశ్బాబు, అల్లు అర్జున్ నడుస్తున్నారు. ఇప్పటికే మహేశ్బాబు నటించిన భరత్ అను నేను సినిమా ఆడియో విడుదల విశాఖపట్టణంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీన ఆ కార్యక్రమం నిర్వహించనున్నారు. మహేశ్ మాదిరిగా అల్లు అర్జున్ కూడా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా ప్రీ రిలీజ్ను విశాఖపట్టణంలోనే నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారని సమాచారం.
బన్నీ తన సినిమా సరైనోడును విశాఖపట్టణంలోనే ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించాడు. ఇప్పుడు కూడా అదే విధంగా వెళ్లాలని నిర్ణయించాడు. దీంతో స్టార్ హీరోలందరూ హైదరాబాద్ను కాదు అని వెళ్లిపోవడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. భవిష్యత్లో సినీ పరిశ్రమ అంతా ఏపీకి తరలివెళ్తుందా అనే భయం కొందరిలో అలుముకుంది.