దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంపై తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. చిత్రం ఎప్పుడు విడుదళ అవుతుందా అని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కాసేపటి క్రితం ఈ చిత్ర ట్రైలర్ ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉన్న సన్నివేశాలు, డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి.
పాదయాత్ర ముందు వైఎస్సార్కు ఎదురైన కొన్ని పరిస్థితులతో పాటు, పాదయాత్ర సాగిన తీరును ఈ చిత్రంలో ప్రధానంగా చూపించినట్టు ట్రైలర్లో ప్రతిబింబించింది. పాదయాత్రలో ప్రజలతో మమేకమైన తీరును కళ్లకు కట్టినట్టు చూపించారు. ట్రైలర్ విషయానికి వస్తే..
‘నా విధేయతను.. విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోకండి’, ‘నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ.. జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం’, ‘మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేది ఏముంది.. ముందుకెళ్లాల్సిందే’ అని మమ్ముట్టీ పలికిన డైలాగులు గుండెకు హత్తుకునేలా ఉన్నాయి. చివర్లో ఓ వ్యక్తి రాజశేఖర ఈ సారి నా ఓటు నీకే.. నీ పార్టీకి కాదు అని పలికిన డైలాగ్ ఆకర్షించేదిగా ఉంది .నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ.. జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం.. జనాలకు ఏం కావాలో తెలుసుకోవాలని ఉంది. వారి గొంతు వినాలని ఉంది అనే మరో డైలాగ్ గుండెలను హత్తుకొనే విధంగా ఉంది.
ముఖ్యంగా ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్న ఓ రైతు వైఎస్తో ఏదో చెప్పాలనుకోవడం, డాక్టర్లు అతను మాట్లాడలేడని చెప్పిన అనంతరం ‘నాకు వినపడుతుందయ్యా’ అంటూ వైఎస్ పాత్రకు జీవం పోశారు మమ్ముట్టి. ఈ సమాజంలో అన్నింటికన్నా పెద్ద జబ్బు పేదరికం అనే డైలాగ్ జనాల మనసులను తాకేలా ఉంది. ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రను మమ్ముట్టి పోషించగా జగపతిబాబు, సుహాసిని, సుధీర్ బాబు, రావు రమేష్, అనసూయ, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు.
తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్ అవుతోంది. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. చిత్రం విడుదళ తర్వాత ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.