హైదరాబాద్ నగరంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కండక్టర్ చూపిన అప్రమత్తత భారీ ఎత్తున సాగుతున్న గంజాయి రవాణాను అడ్డుకుంది. శనివారం రోజు అమీర్పేట్ నుండి షిరిడీకి బయల్దేరిన ఒక ప్రైవేట్ బస్సు మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఆగింది. ఆ సమయంలో ఆరుగురు వ్యక్తులు ఔరంగాబాద్ వెళ్లేందుకు ఆ బస్సు ఎక్కడానికి వచ్చారు. అయితే, వారు తీసుకొచ్చిన లగేజీ బ్యాగ్లను బస్సు డిక్కీలో పెడుతున్న క్రమంలో, సదరు బస్ కండక్టర్కు వారి ప్రవర్తనపై అనుమానం వచ్చింది.
వెంటనే అప్రమత్తమైన కండక్టర్.. ఆ లగేజీ బ్యాగ్లలో ఏముందో చూపించాలని ఆ వ్యక్తులను గట్టిగా నిలదీశాడు. కండక్టర్ అడిగిన ప్రశ్నకు భయాందోళనకు గురైన ఆ ఆరుగురు వ్యక్తులు, సమాధానం చెప్పకుండానే తమ బ్యాగ్లను అక్కడే వదిలేసి మాయమయ్యారు. ఎంతసేపటికీ వారు తిరిగి రాకపోవడంతో కండక్టర్ స్వయంగా ఆ బ్యాగ్లను తెరిచి చూడగా, అందులో ప్యాక్ చేసి ఉన్న గంజాయిని గుర్తించాడు. దీనిపై ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మియాపూర్ పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ లగేజీ బ్యాగ్లను పరిశీలించి, అందులో ఉన్న 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ గంజాయి విలువ మార్కెట్లో సుమారు రూ. 20 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇంత భారీ మొత్తంలో గంజాయిని పట్టించిన ప్రైవేట్ బస్ కండక్టర్ను మాదాపూర్ డీసీపీ రితీరాజ్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి, సన్మానం చేశారు. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, పరారైన ఆరుగురు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
