నాగర్ కర్నూల్ జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో పలువురు మైనర్ బాలికలను మోసం చేసి అఘాయిత్యాలకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి వ్యవహారం బయటపడడంతో స్థానికంగా కలకలం రేగింది.
పోలీసుల సమాచారం ప్రకారం, నిందితుడు సోషల్ మీడియా మరియు ఫోన్ ద్వారా మైనర్ బాలికలతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వారిని మోసం చేసినట్లు తెలుస్తోంది. అనంతరం వారికి దగ్గరై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో ఒక మైనర్ బాలిక గర్భం దాల్చినట్లు గుర్తించారు.
అందుకు సంబంధించి కొల్లాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు గర్భస్రావం (అబార్షన్) చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా నిందితుడి మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అత్యాచారాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై పోలీసులు కొల్లాపూర్లోని సాయి కృప ఆసుపత్రిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కలిసి ఆసుపత్రిలో సుమారు ఆరు గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్ను అధికారులు తాత్కాలికంగా మూసివేసి తాళం వేశారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని బాధితులు ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది.
