అన్నమయ్య జిల్లాలోని కంటేవారి పల్లెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన ప్రదీప్ (19) అనే యువకుడు తన ప్రియురాలి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకోవడంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
సమాచారం ప్రకారం, గత ఐదేళ్లుగా ఒక యువతిని ప్రేమిస్తున్న ప్రదీప్కు ఇటీవల తీవ్ర మనస్థాపం కలిగినట్లు తెలుస్తోంది. యువతిని ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లడంతో అతను భావోద్వేగానికి లోనై ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు.
మంటలు ఎగిసిపడుతుండగా గమనించిన గ్రామస్థులు వెంటనే స్పందించి మంటలను ఆర్పారు. అనంతరం 108 అంబులెన్స్ సాయంతో అతడిని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.
