వరంగల్లో సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో NIT మాజీ ప్రొఫెసర్ను టార్గెట్ చేసి, దాదాపు రూ.కోటి వరకు మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే, బాధితుడు సుధాకర్ అనే మాజీ ప్రొఫెసర్ పెట్టుబడి అవకాశాల కోసం ఇంటర్నెట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వెతికారు. ఈ క్రమంలో ఒక వెబ్సైట్లో కనిపించిన లింక్పై క్లిక్ చేయడంతో పాటు, తన వాట్సాప్ నంబర్ను నమోదు చేశారు. దీంతో సైబర్ నేరగాళ్లు అతనితో సంప్రదింపులు ప్రారంభించారు.
తర్వాత బాధితుడిని “H_18” అనే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. అక్కడ ఉన్న సభ్యుల ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. అంతేకాకుండా “కిరణ్” అనే వ్యక్తి కంపెనీ అకౌంట్స్ మేనేజర్గా పరిచయం చేసుకుని, పెట్టుబడులు పెడితే అధిక రాబడులు వస్తాయని భరోసా ఇచ్చాడు.
ఈ మోసపూరిత హామీలను నమ్మిన సుధాకర్, జనవరి 1 నుంచి విడతల వారీగా నేరగాళ్లు చెప్పిన బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం ప్రారంభించారు. ఇలా మొత్తం మీద దాదాపు రూ.1 కోటి వరకు ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే, కొంతకాలానికి డబ్బులు తిరిగి రాకపోవడంతో పాటు, నేరగాళ్ల నుంచి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.
ఈ ఘటనతో మళ్లీ ఒకసారి సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు.
అపరిచిత లింక్లపై క్లిక్ చేయకూడదు. సోషల్ మీడియా లేదా వాట్సాప్ ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్లను నమ్మకూడదు.డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే ముందు సంస్థ నిజస్వరూపం చెక్ చేయాలి. సులభంగా అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆఫర్ల వెనుక మోసం ఉండే అవకాశం ఎక్కువ. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
