మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా పోచారం డివిజన్లో చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని అదే పాఠశాలలో పనిచేస్తున్న ఫిజిక్స్ ఉపాధ్యాయుడు పర్రే మైటీన్ (27) మాయమాటలు చెప్పి ప్రేమలో పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నమ్మకం సంపాదించిన అనంతరం ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సుమారు 20 రోజుల క్రితం విద్యార్థిని మెడలో పసుపు తాడు గమనించిన తల్లి అనుమానంతో ప్రశ్నించగా, జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే బాలిక తల్లిదండ్రులు పాఠశాల నిర్వాహకులను నిలదీశారు. అయితే వారి నుంచి నిర్లక్ష్యమైన సమాధానం రావడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో బాలిక మైనర్ అని నిర్ధారణ కావడంతో పర్రే మైటీన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన విద్యా వ్యవస్థలో భద్రత, బాధ్యతలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. విద్యార్థుల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
