ఇండోర్లో ఎంబీఏ విద్యార్థిని హత్య కేసులో షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి విషయంపై తలెత్తిన వివాదం కారణంగా ప్రియుడు ఆమెను గొంతునులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం నిందితుడు మహారాష్ట్రకు పారిపోయి, బాధితురాలి ఆత్మను పిలిచేందుకు ఓ హోటల్ గదిలో తాంత్రిక పూజలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటన అనంతరం కొన్ని రోజులకే అతడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
జనవరి 13న ఇండోర్లోని ద్వారకాపురి ప్రాంతంలోని అద్దె ఫ్లాట్లో 24 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైంది. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు మంచంపై నగ్నంగా ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. మెడపై తాడు ముద్రలు ఉండటంతో గొంతునులిమి చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఆ ఫ్లాట్ను ఆమె ప్రియుడు పీయూష్ ధామ్నోడియా అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. అతడిని ముంబైలో పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో పెళ్లి విషయంలో కుటుంబ సభ్యుల వ్యతిరేకత కారణంగా తరచూ గొడవలు జరిగేవని వెల్లడైంది. ఘటన రోజున ఇద్దరూ ఫ్లాట్లో కలుసుకుని వాగ్వాదానికి దిగగా, ఆగ్రహంతో అతడు గొంతునులిమి హత్య చేసినట్లు తెలిపారు.హత్య తర్వాత మహారాష్ట్రలోని పన్వెల్కు వెళ్లి మొబైల్ ఫోన్ను ధ్వంసం చేశాడు.
