రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘రెడ్బుక్ రాజ్యాంగం’తో వెన్నుపోటు పార్టీ ఆటలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. అక్రమ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆలూరు వైయస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన పరామర్శించి, కుటుంబానికి అండగా ఉంటామని భైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
కేవలం రాజకీయ కుట్రలతోనే ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్ట్ చేయించారని, చంద్రబాబు తన అధికారాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్ జగన్ నిలదీశారు. ఏపీలో ప్రస్తుతం బాధితులే నిందితులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడం, తిరిగి దాడికి గురైన వారిపైనే అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. బాధితులకు ఎవరైనా ధైర్యంగా అండగా నిలబడితే వారి గొంతు నొక్కేసేలా కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే అరెస్ట్ తీరుపై మండిపడుతూ.. ఏకంగా ప్రజాప్రతినిధి ఇంటిపైనే పోలీసులతో దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రత్యక్ష డైరెక్షన్లో వందల మంది పోలీసులు ఏకంగా దొంగల మాదిరిగా విరూపాక్షి ఇంటి కిటీకీలు, తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారని దుయ్యబట్టారు. కేవలం గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యేపై మూడు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. తొలి కేసులో 34 మందిని, రెండో కేసులో 14 మందిని, మూడో కేసులో మరో 12 మందిని అన్యాయంగా ఇరికించి మొత్తం 38 మందిని అక్రమంగా జైలుకు పంపించారని వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు పన్నినా పార్టీ శ్రేణుల బలం ముందు ఈ రాక్షస పాలన ఎక్కువ కాలం నిలవదని స్పష్టం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజాక్షేమం కోసమే పోరాడుతుందని, అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.
