మధ్యప్రదేశ్లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త నల్లగా ఉన్నాడని అసహ్యంతో, ప్రియుడితో కలిసి అతడిని హతమార్చిన ఘటన సంచలనంగా మారింది. థార్ జిల్లాలో దేవకృష్ణ (28), అతని భార్య ప్రియాంక పురోహిత్ (25) కలిసి నివసిస్తున్నారు.
ఈ నెల 7వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దేవకృష్ణపై దాడి చేసి హతమార్చారు.తర్వాత ప్రియాంక కన్నీరు పెట్టుకుంటూ, “దొంగలు ఇంట్లోకి వచ్చి తనను కట్టేసి, భర్తను చంపి, నగదు-నగలు దోచుకెళ్లారు” అంటూ నాటకం ఆడింది.
ప్రియాంక చెప్పిన వివరాల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు లోతుగా విచారణ ప్రారంభించారు. కాల్ డేటాను పరిశీలించగా, కమలేష్ పురోహిత్ అనే వ్యక్తితో ఆమెకు అక్రమ సంబంధం ఉన్నట్లు బయటపడింది.
పోలీసుల విచారణలో ప్రియాంక, ఆమె ప్రియుడు కమలేష్ పురోహిత్ నిజాన్ని ఒప్పుకున్నారు.సురేంద్ర భాటియా అనే వ్యక్తికి సుపారి ఇచ్చి, దేవకృష్ణను హత్య చేయించినట్లు వెల్లడించారు.దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తన భర్త నల్లగా ఉన్నాడని, తన స్థాయికి సరిపోడని భావించిన ప్రియాంక, ప్రియుడితో ఉన్న సంబంధం బయటపడడంతో భర్తను తొలగించేందుకు ఈ కుట్ర పన్నింది. పూర్తి వివరాలు బయటపడడంతో పోలీసులు ప్రియాంక, కమలేష్ పురోహిత్ సహా సంబంధిత నిందితులను అరెస్ట్ చేశారు.
