ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే ఇప్పుడే పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఇక రేసులో అధికార వైసీపీ ఒకడుగు ముందే ఉండగా ప్రతిపక్ష టీడీపీ – జనసేన కూటమిలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా జనసేనతో సీట్ల సర్ధుబాటు, దీనికి తోడు ఈ రెండు పార్టీల నేతలకు అసంతృప్తుల బెడద. ఇలా ఇరు పార్టీల నేతలు తీవ్రమైన అయోమయంలో ఉన్నారు.
అయితే ఇప్పటికే ఎన్నికల కసరత్తు ప్రారంభించిన చంద్రబాబు నూతన సంవత్సరం కానుకగా 50 మందితో తొలిజాబితా విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో గ్రూపు గొడవలు లేని స్థానాలు, జనసేనతో సర్దుబాటు చేసుకునే సీట్లను పక్కనపెట్టి తొలి జాబితా విడుదల చేయనున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో టీడీపీ నేతల్లో టెన్షన్ మరింత పెరిగిపోయింది.
ఇక అటు జనసేన నేతలు సైతం ఎవరికి టికెట్ దక్కుతుంది..ఏ స్థానం నుండి పోటీ చేస్తామో తెలియక టెన్షన్లో ఉన్నారు. ముందు కలిసి నడుద్దాం. కలబడి నిలబడుదాం.. గెలుద్దాం.. ముఖ్యమంత్రి ఎవరనే ముచ్చట మేమిద్దరం చూసుకుంటామని ఇరు పార్టీల నేతలు క్యాడర్కు దిశా నిర్దేశం చేస్తుండగా సీఎం సంగతి తర్వాత అసలు తమకు టికెట్ వస్తుందో రాదో చెప్పాలని పలు నియోజకవర్గాల్లో నేతలు డిమాండ్ చేస్తున్నారు.
వాస్తవానికి టీడీపీ – జనసేన పార్టీలకు అభ్యర్థుల ఎంపిక తలకు మించిన భారం అవుతోంది. ఎందుకంటే ఎవరికి టికెట్ ఇచ్చినా..టికెట్ దక్కని వారితో గ్రూపు రాజకీయాలు తప్పవు. అందుకే బ్యాలెన్స్గా గ్రూపు రాజకీయాలను మేనేజ్ చేస్తూ ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. ఎంత బుజ్జగించినా అసంతృప్త నేతలను పోటీ చేసే అభ్యర్థులను ఏకతాటిపైకి తేడం కష్ట సాధ్యమే. దీనికి తోడు జగన్ ప్రభంజనాన్ని చంద్రబాబు, పవన్ ఎదుర్కోవడం అసాధ్యమని అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో తొలి జాబితాలో చోటు ఎవరికి? వేటు ఎవరికి? అనేది త్వరలోనే తేలిపోనుంది.