ఏపీ రాజకీయాలు హస్తినకు చేరాయి. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలవగా జనసేనాని పవన్ సైతం హస్తినకు పయనమయ్యారు. తాజాగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారైంది. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న జగన్,…రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీకి రావాల్సిన నిధులు,విభజన హామీలు, అభివృద్ధిపై చర్చించనున్నారు.
ఇక తన పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు జగన్. పోలవరం కోసం ఖర్చు చేస్తే కేంద్రం రీయంబర్స్ చేస్తుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకవాత్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయనతో సమావేశం కానున్నారు. అలాగే కేంద్రం నుండి రావాల్సిన నిధులపై ఆయా శాఖల మంత్రులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
ఈ నెల చివరి వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు…ఎన్డీఏ కూటమిలో చేరడం దాదాపు ఖాయం అయింది. ఇక పవన్ కూడా హస్తినకు వెళ్లనుండటంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి.