తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లనుండగా దీనికోసం గట్టి పోటీ నెలకొంది. అయితే మొదటి నుండి అంతా ఊహించిన పేరు అద్దంకి దయాకర్. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అద్దంకి దయాకర్ తుంగతుర్తి సీటును ఆశీంచారు. రెండు సార్లు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలుకాగా ఈసారి తనకే టికెట్ వస్తుందని భావించారు. కానీ చివరి నిమిషంలో వేరే వారికి టికెట్ కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం.
అయితే ఏ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేయకుండా పార్టీ కోసమే పనిచేశారు దయాకర్. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిదశలో అద్దంకికి ప్రాధాన్యత ఉంటుందని భావించారు. అనుకున్నట్లుగానే అన్ని మీడియాల్లో దయాకర్కు ఎమ్మెల్సీ కన్ఫామ్ అయిందని వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో దయాకర్కు హ్యాండ్ ఇచ్చింద కాంగ్రెస్.
ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్తో పాటు టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లను చివరకు ఫైనల్ చేసింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేయగా దయాకర్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. దీంతో అసెంబ్లీలో అత్యధిక బలం కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ఎమ్మెల్సీలను గెలవనుంది.