ఇండిగో విమానాల రద్దులతో దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న సమయంలో, సాధారణంగా రూ.5,000 ఉండే కొన్ని రూట్ల టికెట్ ధరలు ఇతర ఎయిర్లైన్స్లో రూ.40,000 వరకు పెరగడం పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇటీవలి ఇండిగో విమానాల రద్దుల నేపథ్యంలో ఇతర ఎయిర్లైన్స్ టికెట్ ధరలను రూ.35,000–39,000 వరకు పెంచడానికి ఎలా అనుమతించారని కేంద్రాన్ని, సంబంధిత అధికారులను హైకోర్టు బుధవారం ప్రశ్నించింది.
క్రైసిస్ ఉన్నప్పుడు ఇతర ఎయిర్లైన్స్ ఈ పరిస్థితిని ఎలా లాభంగా మలుచుకుంటాయి? ధరలు ఇలా ఎలా పెరుగుతాయి? ఇది ఎలా అనుమతించారు?” అని హైకోర్టు బెంచ్ తీవ్రంగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ, సంబంధిత పత్రాలను ప్రస్తావిస్తూ “చట్టపరమైన వ్యవస్థ పూర్తిగా అమల్లో ఉంది” అని కోర్టుకు తెలిపారు.
అతను ఇంకా పేర్కొన్నదేమంటే, FDTL (Flight Duty Time Limit) అమలు చేయడానికి కేంద్రం చాలాకాలం నుంచి ప్రయత్నిస్తోందని, కానీ జూలై మరియు నవంబర్ దశల కోసం ఇండిగో పొడిగింపులు కోరిందని తెలిపారు.”ఇది మంత్రిత్వ శాఖ మొదటిసారి నేరుగా జోక్యం చేసుకున్న సందర్భం. మేము ఇప్పటికే ఎయిర్ఫేర్పై కాపును విధించాం – అదే కఠినమైన నియంత్రణ చర్య” అని ASG చెప్పారు.
విమానాల రద్దులపై తీసుకున్న చర్యల గురించి, ఎయిర్లైన్స్ బాధ్యతగా వ్యవహరించడానికి ప్రభుత్వం ఏం చేస్తోందని కోర్టు ప్రశ్నించింది. ప్రయాణికులకు పరిహారం కోసం ఏ చర్యలు తీసుకున్నారు? ఎయిర్లైన్ సిబ్బంది బాధ్యతగా ప్రవర్తించేలా ఎలా చూస్తున్నారు?” అని కోర్టు వ్యాఖ్యానించింది. సమస్య కేవలం అసౌకర్యం మాత్రమే కాదు… ఆర్థిక నష్టం, వ్యవస్థపరమైన వైఫల్యాలు కూడా ఉన్నాయని కోర్టు సూచించింది.విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు సహాయం చేయడానికి చేసిన ఏర్పాట్లను వివరించమని కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది.
