మాజీ మంత్రి మల్లారెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకమైన శైలీ. ఏడు పదుల వయస్సులోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు మల్లారెడ్డి. తన మాటతీరే కాదు డ్యాన్స్లతో సోషల్ మీడియాలో మల్లారెడ్డి టాపికే. పాలమ్మినా, పూలమ్మినా అంటూ ఆయన చెప్పిన డైలాగ్ అందరికి గుర్తుండి పోతుంది.
మల్లారెడ్డి విద్యాసంస్థలతో పేరు గాంచారు. ఇక టీడీపీ నుండి రాజకీయ ప్రస్థానాన్నిమొదలు పెట్టారు. మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు.ఇక మంత్రిగా తన మార్క్ చూపించారు మల్లారెడ్డి. తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలవగా ఈసారి మాత్రం బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు. దీంతో మల్లారెడ్డి చూపు ఇప్పుడు కాంగ్రెస్ వైపు మళ్లింది.
అయితే కాంగ్రెస్లో ఉన్నన్ని రోజులు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి ఆయనిచ్చిన సమాధానం ఏంటంటే ఎన్నికలప్పుడే రాజకీయాలు ఆ తర్వాత అందరం ఒకటేనని చెప్పుకొస్తున్నారు. ఇక అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తానని తెలిపారు.
బీఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు ఆయనపై అనేక భూ కబ్జా ఆరోపణలు రాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే శామీర్ పేట భూముల వ్యవహారపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి మనసు మార్చుకుని ఉంటారని ప్రచారం జరుగుతుండగా బీఆర్ఎస్ నేతలు సైతం మల్లారెడ్డి పార్టీ మారడం ఖాయమని చెబుతుండటం విశేషం.