కోటరీలో ఉన్న వారే కోటరీపై విమర్శ చేసుకోవాలని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. నిన్నటి వరకు వైయస్ జగన్ కోటరీలోనే ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.
జగన్ కోటరీ అంటే అది ఆయనను అభిమానించే ప్రజలు.. 15 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వైసీపీ కార్యకర్తలేనని స్పష్టం చేశారు. జగన్కు అత్యంత సన్నిహితుడుగా ఆయన మాటల్లోనే చెప్పాలంటే పూజారిగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎలా వ్యవహరించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు.
విజయసాయిరెడ్డి వైయస్ఆర్సీపీని వీడి వెళ్లిపోయిన తర్వాత ఇంతకన్నా పద్దతిగా మాట్లాడతారని మేం అనుకోలేదు. ఢిల్లీ వేదికగా రాజకీయాలకు దూరంగా ఉంటానని, వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. తాజాగా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజు వరకు ఏ పార్టీలో చేరబోయేది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఆయన మాటల్లో మార్పు చాలా స్పష్టంగా, భిన్నంగా కనిపిస్తోంది. విజయసాయిరెడ్డికి ఒకరి మీద మనసు విరిగిపోయిందంటే ఇంకొకరి ప్రేమ పుట్టిందనే అనుకోవాలి అన్నారు.
ఎన్నికలకు ముందు విద్యార్ధులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పింఛన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి కీలకమైన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించి తీరాల్సిందేనన్నారు. విద్య, వైద్యరంగాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని ప్రజలకు సేవలందించాలి అన్నారు.
