రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే దానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. టీడీపీ జనసేన మధ్య పొత్తు పొడిచింది. ఇకపై కలిసే పోరు చేస్తామని రాజమండ్రి సెంట్రల్ జైలు బయటినుండి ప్రకటించారు టీడీపీ నేతలు నారా లోకేష్, బాలకృష్ణ,జనసేన అధినేత పవన్. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా వీరిద్దరి మధ్య చీకటి బంధాన్ని రాజకీయ విశ్లేషకులు ఎప్పుడో ఊహించారు. ఇది టీడీపీ – జనసేనల మధ్య పొత్తు కాదని జనసేనలో టీడీపీ, టీడీపీలో జనసేన విలీనమని వాదిస్తున్నారు.
వాస్తవానికి గతంలో జనసేన – టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి. ఇక టీడీపీ నేతలతే పవన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ రివర్స్. పవనే మ నాయకుడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. దీనంతటి కారణం టీడీపీ – జనసేన పొత్తే. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాగా హార్ట్ అయినట్లు ఉన్నారు. అందుకే బాబు అవినీతిపై నోరు మెదపని పవన్…ఆయన్ని అరెస్ట్ చేయగానే క్షణం ఆగలేదు. హైదరాబాద్ నుండి విజయవాడకు ప్రత్యేక విమానంలో వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మార్గంలో వచ్చే ప్రయత్నం చేశారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. బాబు అరెస్ట్ విషయంలో టీడీపీ శ్రేణుల కంటే ఎక్కువ నిరసన తెలిపారు పవన్.
ఇక సీన్ కట్ చేస్తే అంతా అనుకున్న తరుణం రానే వచ్చింది. జైలులో చంద్రబాబుతో ములాఖత్ తర్వాత టీడీపీతో పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీచేస్తామని…రేపటి నుండి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తామని ప్రకటించారు. పవన్ పొత్తు ప్రకటన అంతా ఊహించిందే అయినా ఇప్పుడు టీడీపీని కూడా పవనే నడిపిస్తారా అన్న సందేహం అందరిలో నెలకొంది. ఎందుకంటే టీడీపీ – జనసేన పార్టీలది పొత్తు కాదని విలీనం అని పలువురు విమర్శిస్తున్నారు. అయితే టీడీపీలో జనసేన విలీనమా లేక జనసేనలో టీడీపీ విలీనమా అన్నది ఆ పార్టీ నేతలే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి.
వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీకి మద్దతు పలికారు పవన్. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019లో టీడీపీని ఓడించేందుకు పనిచేశారు. తర్వాత బీజేపీకి దగ్గరయ్యారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్…టీడీపీతో పొత్తు కోసం బీజేపీకి హ్యాండ్ ఇచ్చేందుకు కూడా సిద్దమయ్యారు. దీనంతటికి కారణం జగనేనట. శత్రువుకు శత్రువుకు మిత్రువైనట్లు పవన్ – బాబు టార్గెట్ జగనే కాబట్టి వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఇక రాజకీయాల్లో సీనియర్ అయినా చంద్రబాబు…పవన్ని తనవైపు తిప్పుకోవడంలో వందశాతం సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
రాజమండ్రి జైలు నుండి బాబు గారు ఇచ్చే డైరెక్షన్లో ఇకపై పనిచేయనున్నారు పవన్. పొత్తుపై పవన్ ప్రకటన చేయగానే ఇదే సంకేతం జనాల్లోకి వెళ్లిపోయింది.టీడీపీ కేడర్ కూడా పవన్ వైపు సానుకూలంగా ఉన్నారు. గతంలో పవన్ని విమర్శించిన నేతలు సైతం ఆయన కోసం క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. మీడియా కూడా పవన్నే ప్రొజెక్టు చేస్తుండటంతో ఇప్పుడు టీడీపీకి జనసేనానే పెద్ద దిక్కుకానున్నారు. జరుగుతున్న పరిణామాలను బట్టిచూస్తూ త్వరలో టీడీపీలో జనసేన విలీనం కావడం ఖాయంగా కనిపిస్తోందని నెటిజన్లు వాదిస్తుండగా జనసేన నేతలు మాత్రం టీడీపీనే తమ పార్టీలో విలీనం కావాల్సిన పరిస్థితి అని చెప్పుకొస్తున్నారు. మరి ఎవరు ఎవరిలో విలీనం అవుతారో కాలమే సమాధానం చెప్పనుంది.