టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా దూకుడు పెంచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీ పొత్తులో సీట్లు, పోటీ చేసే స్థానాల సంఖ్య ఇంకా ఖరారు కాలేదు. అయితే ఖచ్చితంగా పట్టు బట్టే స్థానాలపై దృష్టిసారించారు పవన్. ఇప్పటికే మంగళగిరి పార్టీ కార్యాలయంలో మకాం వేసిన పవన్..ఆయా నియోజకవర్గ ఇంఛార్జీలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు.
టీడీపీతో పొత్తులో భాగంగా 40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుండగా ఇందులో 16 స్థానాల్లో రివ్యూ కంప్లీట్ చేశారు పవన్. వీటిలో ఖచ్చితంగా అభ్యర్థులను బరిలో దింపాలనే ఆలోచనలో ఉన్నారు పవన్. అలాగే మిగితా స్థానాల్లో రివ్యూ కంప్లీట్ చేసి టీడీపీకి జాబితాను మరోసారి అందించనున్నారు పవన్.
ఇక ఇప్పటివరకు పవన్ రివ్యూ నిర్వహించిన నియోజకవర్గాలను పరిశీలిస్తే తిరుపతి, ఒంగోలు, గుంటూరు వెస్ట్, తెనాలి , మచిలీపట్నం, అవనిగడ్డ, కొత్తపేట, అమలాపురం, రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్, ముమ్మడివరం, భీమిలి, ఎలమంచిలి, పెందుర్తి, నెలిమర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. త్వరలోనే మిగితా స్ధానాలపై సమీక్ష చేసి లిస్ట్ను ప్రీపేర్ చేయనున్నారు.
అభ్యర్థులతో నేరుగా సమావేశం అవుతున్న పవన్..నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, అభ్యర్థుల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీతో పొత్తులో భాగంగానే పోటీ చేయబోయే స్థానాలను ఖచ్చితంగా ఎంచుకున్న తర్వాతే పవన్ రివ్యూ నిర్వహిస్తున్నారని జనసేన నేతలు చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో సీట్ల పంపకాలకు సంబంధించిన అంశంపై పవన్ ఒక స్పష్టతకు రావడంతో టీడీపీతో పాటే జనసేన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా గతానికంటే భిన్నంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో అడుగులు వేస్తున్నారు పవన్.