అంతా అనుకున్నట్లే జరిగింది. ఏపీలో టీడీపీ – జనసేన మధ్య పొత్తు కుదిరినా సీట్ల పంపకాలు తేలలేదు. కొన్ని కీలక స్థానాల్లో ఇరు పార్టీల నేతలు పోటీ పడుతుండటంతో సీట్ల పంపకంపై ప్రతిష్టంభన నెలకొంది. పలుమార్లు ఇరు పార్టీల నేతలు భేటీ అయినా ఎన్ని స్థానాలు అనేదానిపై మాత్రం క్లారిటీకి రాలేకపోయారు. ఇక టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంపకాలపై ఇరు పార్టీల నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా అదే నిజమైంది.
టీడీపీతో పొత్తు అంశంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల మండపేట రా కదలిరా సభలో టిడిపి అభ్యర్ధిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరు ప్రకటించిన చంద్రబాబు. దీనిపై స్పందించిన పవన్..పొత్తు ధర్మాన్ని బాబు పాటించడం లేదన్నారు. పొత్తు ప్రకారం టీడీపీ సీట్లు ప్రకటించకూడదు.. కానీ సీట్లు ప్రకటించారన్నారు. సీఎం పదవిపై లోకేష్ మాట్లాడినా తాను పట్టించుకోలేదన్నారు.
ఇక ఈ విషయంలో జనసేన నేతలకు క్షమాపణ చెప్పిన పవన్… వాళ్ళు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి మేము రెండు సీట్లు ప్రకటిస్తాం అని చెప్పారు. ఇందులో భాగంగా రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించి చంద్రబాబుకు షాకిచ్చారు.
