తెలంగాణ ఆర్టీసీ(TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బస్సు డ్రైవర్లకు నో ఫోన్ విధానం తీసుకొచ్చింది. దీనికి కారణం డ్రైవర్లు ఎక్కువ మంది సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం. తద్వారా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
విధుల సమయంలో డ్రైవర్ల వద్ద సెల్ఫోన్లు ఉండకూడదని నిర్ణయిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త విధానం నేటినుంచి ( సోమవారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. తొలుత 11 రీజియన్ల నుంచి ఒక్కో డిపోను పైలట్ ప్రాజెక్ట్ కింద ఆర్టీసీ యాజమాన్యం ఎంపిక చేసింది.
ఈ కొత్త విధానం ముందుగా ఏఏ డిపోల్లో అమలు కానుందంటే … ఫరూక్నగర్ (హైదరాబాద్), కూకట్పల్లి (సికింద్రాబాద్), కొల్లాపూర్ (మహబూబ్నగర్), సంగారెడ్డి (మెదక్), మిర్యాలగూడ (నల్గొండ), జగిత్యాల (కరీంనగర్), ఖమ్మం (ఖమ్మం), కామారెడ్డి (నిజామాబాద్), వికారాబాద్ (రంగారెడ్డి), ఉట్నూర్ (ఆదిలాబాద్), , పరకాల (వరంగల్) ఉన్నాయి.
ఉదయం డ్యూటీకి వచ్చే డ్రైవరు తన సెల్ఫోన్ను స్విచ్ఛాప్ చేసి డిపోలోని సెక్యూరిటీ ఆఫీస్ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సాయంత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే ముందు తమ ఫోన్ను తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర సమయాల్లో వారితో మాట్లాడేందుకు డిపోల్లో ప్రత్యేకంగా ఓ సెల్ఫోన్ నంబరును ఆర్టీసీ అందుబాటులో తీసుకువచ్చింది. వారి కుటుంబ సభ్యులు ఆ నంబరుకు కాల్ చేసి డిపోకు సమాచారమిస్తే వారు సంబంధిత బస్సు కండక్టర్ ద్వారా సదరు డ్రైవర్తో మాట్లాడడానికి వీలు కల్పిస్తారు.
