ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి పవన్ కాదు… ఓ దిష్టి కళ్యాణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి అని, గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి నీచంగా మాట్లాడిన చరిత్ర ఉందని మహేష్ గౌడ్ ఆరోపించారు.
బీజేపీ నేతలు “భిక్షాం దేహీ” అన్నట్లుగా పవన్ మాట్లాడారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ చెప్పారని తెలంగాణలో ఎవరూ ఓటు వేయరని స్పష్టం చేశారు. రాజకీయాలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్లోనే చేసుకోవాలని, తెలంగాణ రాజకీయాల్లో జోక్యం తగదని హెచ్చరించారు.
అలాగే, పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ…కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలింది అన్న మాటలు అవమానకరంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమేనని, ఆ శాపం తెలంగాణపై పడినట్టుగా పవన్ వ్యాఖ్యానించారని మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మహేష్ గౌడ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ తరచూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
