శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో పలాస నియోజకవర్గంది ప్రత్యేక స్థానం. గౌతు ఫ్యామిలీ ఆధిపత్యానికి గండి కొడుతు గత ఎన్నికల్లో విజయం సాధించారు సిదిరి అప్పలరాజు. ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు. మరోసారి అప్పలరాజు పోటీ చేస్తుండగా టీడీపీ నుండి గౌతు శిరీష బరిలో ఉన్నారు. పలాస అసెంబ్లీ కంటే ముందు సోంపేటగా ఉండేది ఈ నియోజకవర్గం.గౌతు లచ్చన్న ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది ఈ నియోజకవర్గం. ఈ ఫ్యామిలీ నుండే మెజార్టీ సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
ఇక 2009లో పలాస అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడగా పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలున్నాయి. మొత్తం 2 లక్షల 10 వేల ఓటర్లు ఉండగా మత్స్యకార ఓటర్లే ఎక్కువ. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, 2014లో టీడీపీ తరపున గౌతు ఫ్యామిలీ, 2019లో వైసీపీ వేవ్లో సిదిరి అప్పలరాజు గెలిచారు. ఇప్పటివరకు ఏ పార్టీకి కూడా వరుసగా రెండు సార్లు గెలవలేదు.
ఇక వైసీపీ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా తన కేబినెట్లో అవకాశం కల్పించారు జగన్. గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు అప్పలరాజు. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 700 కోట్లతో ఉద్దానం మంచి నీటి పథకం తీసుకొచ్చారు. మరోవైపు తన కుటుంబ నేపథ్యమే తనను గట్టెక్కిస్తుందనే ధీమాతో ఉన్నారు గౌతు శిరీష. అయితే ఇప్పటివరకు పలాస నుండి ఏ అభ్యర్థి వరుసగా రెండు సార్లు గెలవలేదు. ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాయాలని అప్పలరాజు ఉవ్విళ్లూరుతుండగా గౌతు శిరీష సైతం అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తన కార్యాచరణ అమలు చేస్తున్నారు. మొత్తంగా పలాసలో ఎవరిది పైచేయి అవుతుందో వేచిచూడాల్సిందే.
