ప్రతి గుండెను కదిలించిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ వైయస్ఆర్ అని కొనియాడారు వైసీపీ నేతలు. ఇవాళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైఎస్కు ఘన నివాళి అర్పించారు. తాడేపల్లి లోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహానేత వైయస్ఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని, దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్ళు, పేదలకు దుస్తుల పంపిణీని పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి చేతుల మీదిగా ప్రారంభించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… వైయస్ఆర్ మనకు దూరమైనా, వైయస్ జగన్ రూపంలో మనకు గొప్ప వారసత్వాన్ని అందించారని కొనియాడారు.
రాజశేఖర్ రెడ్డి మనకు దూరమై నేటికి పదహారేళ్లు గడిచిపోయింది. రచ్చబండ కార్యక్రమం కోసం హెలిక్యాప్టర్లో బయల్దేరి వెళ్లిన మహానేత శాశ్వతంగా మనకు దూరమైపోయారు. కానీ ఆయన చేసిన మంచి పనుల రూపంలో ఎప్పటికీ మన గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారు అన్నారు. వైయస్ఆర్ని ఒక్కసారి కలిసిన వారెవరైనా ఎప్పటికీ ఆయన్ను మర్చిపోలేరు అన్నారు. గత ఐదేళ్ల పాలనలో వైయస్ఆర్ ఆశయాలను సంక్షేమ పథకాల రూపంలో వైయస్ జగన్ ఎంత గొప్పగా అమలు చేశారో మనమంతా చూశాం. సంక్షేమ పథకాలకు వైయస్ఆర్ బీజం వేస్తే గత ఐదేళ్ల పాలనలో అంతకన్నా మెరుగ్గా మరిన్ని పథకాలను ముందుకు తీసుకెళ్లగలిగారు అన్నారు.
ప్రతి వీధిలో ఒక ఎన్నారై, ప్రతి పేదవాడి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నాడంటే, అది వైఎస్ దూరదృష్టి, దార్శనికత వల్లే సాధ్యమైందని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సబ్సిడీతో అందించి, గిట్టుబాటు ధరలు కల్పించి వ్యవసాయాన్ని పండుగ చేసిన వ్యక్తి వైయస్ఆర్ అని ఆయన కొనియాడారు. అలాంటి మహానేతకు మనమందరం భక్తిపూర్వక నివాళులు అర్పిద్దామని అన్నారు.
