భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు మరోసారి క్రెడిట్ చోరీ రాజకీయాలకు తెరలేపారని వైయస్ఆర్సీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్ట్ తన ఘనతగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటూ బిల్డప్ ఇస్తున్నారని, వాస్తవానికి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిదేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. అనుమతులు తెచ్చుకోవడం నుంచి నిర్మాణ పనుల వేగం పెంచే వరకు, జీఎంఆర్ గ్రూప్కు స్పష్టమైన డెడ్లైన్లు పెట్టి మరీ పనులు చేయించారని తెలిపారు.
జీఎంఆర్ గ్రూప్స్ ఛైర్మన్ మల్లికార్జున రావు కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే గుర్తుచేశారు. నా మొదటి ఎయిర్పోర్ట్కు హైదరాబాద్లో వైయస్ఆర్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. వారి తనయుడు వైయస్ జగన్ భోగాపురం ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది అని 2023 మే 3న ఆయన పేర్కొన్నారు. ఇది వైయస్ కుటుంబానికి ఉన్న నమ్మకం, విశ్వసనీయతకు నిదర్శనమని వైయస్ఆర్సీపీ నేతలు అంటున్నారు.
అనుమతుల సాధన, పేదలకు పునరావాసం, రైతులకు న్యాయమైన పరిహారం, న్యాయపరమైన అడ్డంకుల తొలగింపు వంటి కీలక అంశాలను సమర్థవంతంగా పరిష్కరించి విమానాశ్రయ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లింది వైయస్ జగన్ గారి పాలనలోనేనని వారు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం వైయస్ జగన్ గారి క్రెడిబులిటీకి ప్రత్యక్ష ఉదాహరణ అని వైయస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు.
