తమిళనాట క్రేజీ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళంలో రిలీజ్ చేయడానికి సిద్దం అయిన విషయం తెలిసిందే. అందుకు తగినట్లు తమిళనాడు ప్రభుత్వం కూడా థియేటర్స్ విషయంలో నిర్మాతలకు వెసులుబాటును కల్పించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం యాబై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చునని ఆదేశాలిచ్చింది.
అయితే అందుకు భిన్నంగా తమిళనాడు ప్రభుత్వం విజయ్ ‘మాస్టర్’ సినిమాకు వంద శాతం పర్మిషన్స్ ఇచ్చింది. ఈ విషయం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్కు సంతోషాన్ని కలిగించింది. థియేటర్కు రావడానికి ప్రేక్షకుడు భయపడుతున్న ఈ తరుణంలో స్టార్ హీరో సినిమాకు ఇలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. తమిళనాడు ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టింది. కోవిడ్ ప్రభావ పరిస్థితుల దృష్ట్యా వంద శాతం థియేటర్స్ ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరింది. అంతా బావుందనుకుంటున్న సమయంలో నిర్మాతల స్పీడుకు బ్రేకులేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.