కడుపు నొప్పితో బాధపడుతూ మతిస్థిమితం లేని మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్ తిన్నారు. ఆమె కడుపులో ఏకంగా కేజీన్నరకు పైగా బంగారు నగలు , కాయిన్స్ను చూసి అవాక్కయ్యారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది.
వివరాల్లోకి వెల్తే…పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లా రామ్పురహాట్కు చెందిన 26 ఏళ్ల ఓ మహిళ కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ వినహా మరే మార్గం లేకపోవడంతో డాక్టర్లు ఆపరేష్న్ చేశారు. పడుపులోనుంచి చైనులు, ముక్కు పుడకలు, చెవి పోగులు, గాజులు, బ్రాస్లెట్ తదితర ఆభరణాలతోపాటు రూ.5, రూ.10 నాణేలను వెలికితీశామని, వాటి బరువు సుమారు రూ.1.5 కిలో ఉన్నాయని ఆపరేషన్ చేసిన వైద్యుడు డాక్టర్ సిద్ధార్థ బిశ్వాస్ తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు.
ఆమె తల్లి మాట్లాడుతూ.. తన బిడ్డకు మానసిక స్థితి సరిగ్గా లేదు. ఇంట్లో ఉన్న నగలన్నీ మాయమవుతుంటే.. ఎక్కడ పోతున్నాయని ఆమెను అడిగిన ప్రతి సారి ఏడ్చేది. ఇక తమ కుమారుడి షాపులో నుంచి కూడా రూ. 5, రూ. 10ల నాణేలు మాయం అయ్యేవని తెలిపారు. భోజనం చేసినప్పుడల్లా వాంతులు చేసుకునేది. వైద్యుల వద్దకు తీసుకెళ్తే ఈ విషయం తెలిసిందని బాధితురాలి తల్లి తెలిపింది.
