ఎయిర్ సెల్ సేవల నిలిపివేత వొడాఫోన్ కు కలిసొచ్చింది. ఎయిర్ సెల్ నుంచి ఏకంగా 10 లక్షల మంది కస్టమర్లు పోర్ట్ పై వొడాఫోన్కు వచ్చేశారు. కస్టమర్ల అవసరాల నేపథ్యంలో వారంలో అన్ని రోజులూ రిటైల్ కేంద్రాలను తెరిచే ఉంచుతున్నట్టు వొడాఫోన్ ప్రకటన జారీ చేసింది.
తమ నెట్ వర్క్ అవసరమైన బ్యాండ్ విడ్త్, అదనపు సామర్థ్యంతో ఉన్నట్టు తెలిపింది. తీవ్ర నష్టాల భారాన్ని మోస్తున్న ఎయిర్ సెల్ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ను విలీనం చేసుకుని కొత్త ప్రయాణం మొదలు పెడదామని గతంలో ప్రయత్నించింది. ఈ లోపు ఆర్ కామ్ పీకల్లోతు నష్టాల్లోకి వెళ్లి సేవలు ఆపేసింది. దాంతో ఎయిర్ సెల్ కు నష్టాల నుంచి బయటపడే మార్గం తోచలేదు. సేవలు ఆపేస్తున్నట్టు ప్రకటించి దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఎయిర్ సెల్ కస్టమర్లు ఇతర నెట్ వర్క్ ల్లోకి వలసబోతున్నారు. ఎయిర్ సెల్ కు 3 కోట్ల మంది వరకు కస్టమర్లు ఉన్నారు.