ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వరుసగా సీనియర్ నేతలు పార్టీ వీడుతున్నారు. కొన్నాళ్ల క్రితం పార్టీ సీనియర్ నేత వ్యవస్థాపకుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ విషయం మరవకముందే పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన సీనియర్ నేత అశుతోష్ పార్టీకి ఆప్ కి రాజీనామా చేశారు.
వ్యక్తిగత కారణాలతోనే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు అశుతోష్ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన జర్నలిస్ట్ గా పనిచేశారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ ఆయనకు టికెట్ కేటాయించలేదు. దీంతో గత కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
రాజీనామా విషయాన్ని అశుతోష్ ట్విట్టర్ లో ప్రకటించారు. ‘ ప్రతి ప్రయాణానికి ముగింపు ఉంటుంది. ఆప్ తో నా ప్రయాణం విప్లవాత్మకం, అద్భుతమైనది. దీనికి కూడా ముగింపు ఉంది. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ నుంచి తప్పుకుంటున్నా. నా రాజీనామాను అంగీకరించాలని పార్టీని కోరుతున్నా.
సీనియర్ జర్నలిస్టులలో ఒకరైన అశుతోష్ అన్నాహజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు. ఆ తర్వాత ఆప్ లో చేరారు. 2014 లోక్సభ ఎన్నికల్లో దిల్లీలోని చాందినీ చౌక్ నుంచి పోటీ చేసి బీజేపీ నేత హర్షవర్ధన్ చేతిలో ఓటమిపాలయ్యారు.