ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నితిన్ నబిన్ సమక్షంలో ఆప్ కీలక నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. అంతకుముందు విలేకరుల సమావేశంలో రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మూడింట రెండొంతుల మంది రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడుతున్నారని, ఒక వర్గంగా బీజేపీలో చేరుతున్నామని ప్రకటించారు.
పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన సమయంలో రాఘవ్ చద్దా భావోద్వేగానికి గురయ్యారు. నా రక్తం, చెమట ధారపోసి 15 ఏళ్ల యవ్వనాన్ని ఆప్ కోసం ధారపోశాను. కానీ ఇప్పుడు ఆ పార్టీ తన సిద్ధాంతాలు, నైతిక విలువలను పూర్తిగా కోల్పోయింది అని విమర్శించారు.
దేశ ప్రయోజనాల కంటే పార్టీ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. గత కొన్నేళ్లుగా నేను తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని అని అనిపిస్తోంది. అందుకే ప్రజల కోసం పని చేసేందుకు బీజేపీలో చేరుతున్నాను అని ఆయన స్పష్టం చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో మొత్తం 10 మంది ఎంపీలు ఉండగా, అందులో మూడింట రెండొంతుల మంది (సుమారు 7 మంది) తమ వెంటే ఉన్నారని చద్దా పేర్కొన్నారు.ఇప్పటికే సంతకం చేసిన లేఖలు మరియు అవసరమైన పత్రాలను రాజ్యసభ ఛైర్మన్కు సమర్పించినట్లు వెల్లడించారు.కేవలం ఈ ముగ్గురే కాకుండా, హర్భజన్ సింగ్ మరియు స్వాతి మలివాల్ కూడా ఆప్ను వీడుతున్నట్లు ఆయన ప్రకటించడం మరింత కలకలం రేపింది.
మరో ఎంపీ సందీప్ పాఠక్ మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని, 10 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవడం బాధగా ఉందని అన్నారు. పార్టీ తన అసలు లక్ష్యాల నుండి తప్పుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవలే రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుండి రాఘవ్ చద్దాను తొలగించి, ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ను నియమించింది పార్టీ నాయకత్వం. అయితే ఇప్పుడు ఆ అశోక్ మిట్టల్ కూడా చద్దాతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం విశేషం. ఎంపీలపై వస్తున్న ఆరోపణలను చద్దా కొట్టిపారేస్తూ, ఇదంతా కేజ్రీవాల్ నాయకత్వం చేస్తున్న కుట్ర అని విమర్శించారు.
