సీనీ నటుడు మోహన్ బాబు ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. బాబు అహంకారం పారాకాష్టకు చేరిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తమ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆయన తిరుపతిలో ఆందోళన చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని మోహన్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతిలో వందలాది మంది విద్యార్థులు, తన కుమారులు విష్ణు, మనోజ్ లతో కలిసి కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బైఠాయించి నిరసన తెలిపారు.
విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని వెంటనే ఫీజు రీయబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇస్తున్నాడు. ఆవు-దూడ పథకం కింద గోవులను ఇస్తున్నాడు. కానీ విద్యార్థులకు మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేకపోతున్నారాని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు సర్కారు ఆడుకుంటోందని ఆరోపించిన ఆయన, కళాశాలల యాజమాన్యాలకు కట్టాల్సిన డబ్బును ప్రభుత్వం రకరకాలుగా మళ్లిస్తోందని ఆరోపించారు.
చంద్రబాబు అంటే నాకిష్టమే కానీ ఆయన నాటకాలు మాత్రం నాకిష్టం లేదన్నారు. సినిమాల్లో నటిస్తే డబ్బులు ఇస్తారు…అయితే చంద్రబాబు బయట బ్రహ్మాండంగా నటిస్తారంటూ వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆయనకే సభ్యత్వం లేకుండా చేసిన ఘనుడివి నీవన్నారు. అసలు టీడీపీ నీది కాదు. నీవు అన్నగారి వద్ద నుంచి బలవంతంగా లాక్కున్నావంటూ ఘాటు విమర్శలు చేశారు.
ప్రజల దగ్గర దోచుకున్న డబ్బును వాళ్లకే ఇస్తున్న చంద్రబాబు మా విద్యార్థులకు మాత్రం ఎందుకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడంలేదన్నారు. ఇప్పుడు హెచ్చరిస్తున్నాం…తర్వాత న్యాయస్థనాన్ని ఆశ్రయిస్తామన్నారు. మాకు న్యాయం చేయాలని విన్నవించుకుంటాం. కోర్టు ఆదేశాలను శిరసా వహిస్తాం. చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించేవాడు అయితే వెంటనే వాళ్ల ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు.