డబ్బులేనిదే మనిషి అవసరాలు తీరడంలేదు. ప్రతి చిన్న,పెద్ద విషయానికి డబ్బే ప్రధానం. ఒక్క రోజు డబ్బులేకపోతె బిచ్చగాల్ల బ్రతుకే. కాని ఒక్క రూపాయి లేకుండా దేశం మొత్తాన్ని చుట్టి వచ్చాడు మహానుభావుడు. ప్రయానంలో అతను ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
అలహాబాద్కు చెందిన 28 ఏళ్ల అన్షూ మిశ్రా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దేశంలోని 24 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు సందర్శించాడు. 225 రోజుల తన రోడ్డు ప్రయాణంలో కేవలం వాహనాలను లిఫ్ట్ అడగడం ద్వారా మాత్రమే ప్రయాణించినట్లు అన్షూ చెప్పాడు. అలాగే నివాసం, ఆహారం కోసం గుళ్లు, గురుద్వారాలను ఆశ్రయించేవాడినని తెలిపాడు.
ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నానని, డబ్బులు లేకుండా ప్రయాణం చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నట్లు అన్షూ వివరించాడు. `ఈ ప్రయాణం అంత సులభంగా సాగదని… కొన్ని సార్లు ప్రజలు మన వైపు చాలా అనుమానంగా చూస్తారు. మానవత్వం ఉన్న కొంతమంది మాత్రమే సహాయం చేయడానికి ముందుకు వస్తారు` అన్నాడు. ఒక్కో సారి 48 గంటల పాటు పస్తులు ఉండాల్సి వచ్చిందని, అలాగే ఒకసారి దాదాపు 9 గంటల పాటు లిఫ్ట్ ఇచ్చేవారి కోసం ఎదురు చూడాల్సి వచ్చిన విషయాలను తెలియజేశాడు.
ప్రయాణానికి సంబంధించిన వివరాలను చెప్పడం ద్వారా ప్రజల నుంచి సాయాన్ని ఆశించే వాడినని, అంతే తప్ప భిక్షాటన చేసేవాడిని కాదని అన్షూ చెప్పాడు. భూటాన్, మయన్మార్ సరిహద్దులను దాటి వెళ్లానని, బంగ్లాదేశ్ సరిహద్దు దరిదాపులకు కూడా వెళ్లినట్లు పేర్కొన్నాడు. విన్నారుగా ఒక్క రూపాయి లేకుండా దేశాన్ని ఎలా చుట్టి వచ్చాడో.