ప్రపంచ తెలుగు మహాసభలు అద్భుతంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ కొనియాడారు. తమకు సమావేశాలకు ఆహ్వానం పలకకున్నా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విస్మరించినా ఏపీ స్పీకర్ అద్భుతహ అనడం ఆసక్తికరంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వానం పలకకపోయినా తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ బాటలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చేరారు.
తీర్థయాత్రల్లో భాగంగా తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గుంటూరుకు కుటుంబసభ్యులతో చేరారు. గుంటూరు కొత్తపేటలోని ఏపీ స్పీకర్ నివాసానికి తెలంగాణ స్పీకర్ వెళ్లారు. వీరిని ఆత్మీయ స్వాగతం పలికిన కోడెల తన నివాసంలో ఓ రెండు గంటల పాటు ముచ్చట్లు పెట్టారు. అందులో భాగంగా పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు సూపర్.. అద్భుతంగా నిర్వహించారు.. ఇదో చారిత్రక ఘట్టమని కోడెల కొనియాడారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ప్రస్తావనకు వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్యలో ప్రీ బడ్జెట్ సెషన్స్ కు అవకాశాలు ఉన్నాయని కోడెల వివరించారు.
తన రెండో కుమారుడి వివాహం ఇటీవల జరగడంతో కుటుంబసభ్యులతో తెలంగాణ స్పీకర్ కుటుంబసభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తున్నారు. అందులో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ, కోటప్పకొండ ఆలయాలను సందర్శించిన అనంతరం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లనున్నారు.
మూడు దశాబ్దాలుగా కోడెల కుటుంబంతో తనకు అనుబంధం ఉందని తెలంగాణ స్పీకర్ చెప్పారు. తామిద్దరం మంచి దోస్తులం అని తెలిపారు. గతంలో ఒకే పార్టీలో పనిచేయడంతో ఎప్పటినుంచో తమ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. శాసనసభ వ్యవహారాలలో కూడా ఇద్దరం సమన్వయంతో పనిచేస్తున్నామని వివరించారు. తన రెండో కుమారుడి వివాహానికి కోడెలను పిలవగా ఆయన రాకపోవడంతో ఆయన కోసం గుంటూరు వచ్చినట్లు వివరించారు.