విశాఖ జిల్లా రాజకీయాల్లో విశాఖ సౌత్ది ప్రత్యేక స్థానం. నిత్యం గ్రూప్ వార్లు అసలైన రాజకీయానికి కేరాఫ్గా నిలుస్తాయి. 2009లో ఈ నియోజక వర్గం ఏర్పాటు కాగా ఫిషింగ్ హర్బర్, కేజీహెచ్, విశాఖ పోర్టు, ఉత్తరాంధ్ర ఇలవేల్పు కనకమహలక్ష్మి దేవాలయం ఇక్కడే ఉన్నాయి.
3 లక్షల ఓటర్లు ఉన్న విశాఖ సౌత్లో ఓసారి కాంగ్రెస్, ఆ తర్వాత రెండుసార్లు టీడీపీ గెలిచింది. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి అధికార వైసీపీ తరఫున పోటీ చేస్తుండగా, జనసేన నుంచి మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణయాదవ్ బరిలోకి దిగారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పైలట్ ఆఫీసర్గా పనిచేసిన వాసుపల్లి గణేశ్…1994లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అనే విద్య సంస్థను ప్రారంభించి మంచి పేరు సంపాదించారు. 2009లో ఓడిపోయినా ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో గెలుపొందారు. క్రమశిక్షణ ఉన్న రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు గణేష్. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకోవడం, పేదలకు ఆర్ధిక సాయం చేస్తూ మంచిపేరు సంపాదించారు. గత రెండు ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన వాసుపల్లి…ఈసారి వైసీపీ తరపున గెలిచి హ్యాట్రిక్ కొడతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ అనూహ్యంగా జనసేనలో చేరి టికెట్ దక్కించుకున్నారు. అయితే కార్పొరేటర్లు సాధిక్, కందుల నాగరాజు వంటి వారు టికెట్ ఆశీంచగా చివరి నిమిషంలో వచ్చిన వంశీకృష్ణకే టికెట్ ఇవ్వడంతో స్థానికంగా అసంతృప్తి నెలకొంది. పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వాసుపల్లికి తన ఇమేజ్తో పాటు ప్రభుత్వ సంక్షేమం,తన సామాజికవర్గం ఓట్లు కలిసివస్తాయని భావిస్తున్నారు. మరి విశాఖ సౌత్ ఓటర్లు ఎవరికి పట్టం కడతారోనన్నది మరికొద్దిరోజుల్లో తేలనుంది.