ప్రాజెక్టుల్లో అవినీతిపై సహించేది లేదని అధికారులకు సీఎం వైఎస్ జగన్ తేల్చి చెప్పారు.ఇంజనీరింగ్ నిపుణుల కమిటీతో సమావేశమైన ఆయన.. అంచనాలు పెంచిన ఇరిగేషన్ ప్రాజెక్టుల లెక్కలు తీయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఇంజినీరింగ్ నిపుణులతో అమరావతిలో సమావేశం నిర్వహించిన ఆయన తన ఉద్దేశాలను మరింత స్పష్టంగా అధికారులకు వివరించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించేదిలేదని స్పష్టం చేసిన ఆయన.. ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదు.. టెండర్ల విధానాన్ని అత్యంత పాదర్శకంగా రూపొందించాలన్నారు.
ప్రాజక్టుల విషయంలో కళ్లుమూసుకుని ఉండాలని తనపైనా ఒత్తిడి తెచ్చారని, అయితే, అవినీతిపై పోరాటానికి తాను సిద్ధమయ్యానని తన ఉద్దేశ్యం వెల్లడించారు. అవినీతి విషయంలో అది ఏ స్థాయిలో ఉన్నా తాను సహించబోనని, పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు ఒక సందేశం వెళ్లాలని జగన్ హెచ్చరిక ధోరణిలో చెప్పారు.
రూ.100ల పని రూ.80లకే జరుగుతుందంటే రివర్స్ టెండరింగ్కు వెళ్దామని నిపుణుల కమిటీకి తెలిపారు సీఎం వైఎస్ జగన్… ప్రాజెక్టుల్లో అవినీతిని గుర్తించిన అధికారులను సన్మానిస్తామన్న ఆయన.. రివర్స్ టెండరింగ్ ఎక్కడ చేయగలమో గుర్తించండి అని ఆదేశించారు. మన ప్రభుత్వం పాటించే పారదర్శకతే రేపు దేశానికి ఆదర్శం కావాలన్నారు. ఇప్పటికే టెండరింగ్ విధానాల పర్యవేక్షణకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు విజ్ఞప్తి చేశామని తెలిపారు.
పోలవరం పనుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని నిపుణుల కమిటీని ఆదేశించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉంది, అవినీతి వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం జగన్. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గందరగోళం చేసిందని మండిపడ్డ సీఎం.. స్పిల్వే పూర్తిచేయకుండా కాఫర్ డ్యాంకు వెళ్లారు, దాన్ని కూడా పూర్తిచేయకుండా వదిలేశారు.. ఫలితంగా గోదావరిలో వెడల్పు తగ్గింది.. ఇప్పడు భారీగా వరద వస్తే 4 నెలలపాటు పనులు చేపట్టలేని పరిస్థితి ఉందన్న జగన్ పోలవరం తనకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాజక్టు అని పునరుద్ఘాటించారు.