కాపు ఉద్యమం సందర్భంగా తునిలో హింస చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సర్కారు కొంతమందిని తాజాగా అరెస్టులు చేస్తున్న కూడా తెలిసిందే. ఈ మొత్తం పరిణామాలపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమానికి సంబంధించిన వారిపై ఎలాంటి కేసులూ పెట్టం అని చెప్పిన తెలుగుదేశం సర్కారు ఇప్పుడు మాట మార్చేసిందని ఆగ్రహించారు.
ప్రస్తుతం పెడుతున్న కేసుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలనీ… లేదంటే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగాల్సి ఉంటుందంటూ సర్కారుకు ముద్రగడ హెచ్చరించారు. అయితే, దీనిపై ప్రభుత్వం స్పందించింది. వేడెక్కుతున్న వాతావరణాన్ని కూల్ చేసేలా ఏదైనా ప్రకటన ఉంటుందేమో అనుకుంటే… అందుకు భిన్నంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అధికార పక్షంవారు.
కాపు సంఘాల నేత ముద్రగడ నిరాహార దీక్ష చేస్తారో… మానేస్తోరో అనేది ఆయన ఇష్టం అని వ్యాఖ్యానించారు ఏపీ హోం మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప. ముద్రగడ డిమాండ్ చేస్తున్నారని కేసుల్ని ఉపసంహరించుకోలేం కదా అని స్పష్టం చేశారు. తుని కేసులో అరెస్టులు చేస్తున్నది నేర చరితులు, రౌడీ షీటర్లు. అలాంటి చరిత్ర ఉన్నవారిని మాత్రమే అరెస్టులు చేస్తున్నామనీ… కేసుల్ని వాపసు తీసుకునే ఉద్దేశం తమకు లేదనీ, ఈ ఘటనకు సంబంధించి అరెస్టులు ఇంకా కొనసాగుతాయని రాజప్ప స్పష్టంగా చెప్పేశారు. కాపుల రిజర్వేషన్లకు సంబంధించి సర్కారు ఇచ్చిన గడువుకు ఇంకా రెండునెలలు సమయం ఉందని అన్నారు. కాపుల రిజర్వేషన్కు తెలుగుదేశం సర్కారు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు. ఈలోపే ఆందోళనలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రాజప్ప విమర్శించారు. రాజధాని నిర్మాణానికి జగన్ అడ్డుతగులుతూ ఉంటే… ముద్రగడ కూడా ఒక కులాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని హోంమంత్రి ధ్వజమెత్తారు.
ఏదేమైనా… ముద్రగడను రెచ్చగొట్టే విధంగా అధికార పార్టీవారు వ్యాఖ్యలు చేయడం సరికాదు. తాము అరెస్టులు చేస్తున్నది రౌడీలూ షీటర్లు అనుకుంటే అదే విషయాన్ని మామూలుగా కూడా చెప్పొచ్చు కదా! ఇలా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఏముంది. కాపుల రిజర్వేషన్ల అంశం ఎంత సున్నితమైందో వారికి తెలుసు కదా!