ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు వైసిపి అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం ఆయన అవినీతి సొమ్ముతో పెట్టిన సాక్షి పత్రిక, ఛానెల్ లను వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామక్రష్ణుడు అన్నారు. సాక్షి పత్రిక, ఛానెల్ లను త్వరలో స్వాధీనం చేసుకుంటామని ఆయన చెప్పారు.
అలాగే అవినీతితో ప్రజల సొమ్ము దోచుకున్న వారి నుంచి కూడా ఆ సొమ్మును స్వాధీనం చేసుకుంటామని ఆయన అన్నారు. జగన్ అక్రమాస్తుల స్వాధీనానికి కేంద్రం నుంచి తమకు అనుమతి వచ్చిందని యనమల అన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారి ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన చట్టం రాగానే జగన్ పత్రిక, ఛానెల్ తో పాటు ఇతర ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు.
ఇప్పటికే జగన్ కు చెందిన 43 వేల కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేశారని, అందులోనే జగన్ పత్రిక, ఛానెల్ ఉన్నాయన్నారు. జగన్ అవినీతితో లక్ష ఎకరాల భూమి, లక్ కోట్ల రూపాయలు దోచుకున్నారని యనమల విమర్శించారు. జగన్ కు పిచ్చి ముదిరిందని, ఆయన పిచ్చాసుపత్రిలో చేరే రోజులు వచ్చాయని మరో మంత్రి పీతల సుజాత అన్నారు.