విద్యా రంగంలో సంస్కరణలు తీసుకురావాలని నీట్ అక్రమాలపై చర్యలు తీసుకోవడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) సోమవారం చేపట్టిన “చలో సంసద్” (పార్లమెంట్ మార్చ్) పిలుపుతో జంతర్ మంతర్ వద్ద వేలాది మంది నిరసనకారులు గుమిగూడారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజే ఈ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
మరోవైపు, జంతర్ మంతర్ వద్ద నిరసనకారులపై లాఠీఛార్జ్ జరిగిందని లేదా బలప్రయోగం చేశారంటూ వస్తున్న కొన్ని మీడియా కథనాలను ఢిల్లీ పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ పోలీస్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. “జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు అక్కడక్కడా హింసకు పాల్పడ్డారని లేదా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే అలాంటి ఘటనేదీ జరగలేదని, ఈ నిరసనను పూర్తిగా వృత్తిపరంగా (Professionally) హ్యాండిల్ చేస్తున్నామని తెలియజేస్తున్నాము” అని స్పష్టం చేశారు.
వదంతులు, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని పోలీసులు ప్రజలను కోరారు. నిరసన స్థలంలో మరియు దాని పరిసర ప్రాంతాలలో శాంతిభద్రతలను కాపాడటంలో అధికారులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటడానికి నిరసనకారులు ప్రయత్నించడంతో, అక్కడ మోహరించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బందితో సహా భద్రతా బలగాలతో నిరసనకారులు ఘర్షణకు దిగారు. గుంపును చెదరగొట్టడానికి మరియు శాంతిభద్రతలను కాపాడటానికి లాఠీలను ఉపయోగించినట్లు తెలుస్తోంది.
అయితే, మండి హౌస్ మెట్రో స్టేషన్ నుండి జంతర్ మంతర్ వైపు వస్తున్న వందలాది మంది విద్యార్థులు, యువజన కార్యకర్తలను చెదరగొట్టడానికి ఢిల్లీ పోలీసులు లాఠీలు ఉపయోగించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిరసనకారులలో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఉన్నారు. వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జంతర్ మంతర్ వైపు దూసుకెళ్లారు.
నిరసనకారులను పార్లమెంట్ వరకు వెళ్లడానికి అనుమతించబోమని, వారి కదలికలను కేరళ భవన్ వరకే పరిమితం చేస్తామని పోలీస్ వర్గాలు తెలిపాయి. మార్గమధ్యంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి ఎవరినీ ముందుకు పోనివ్వబోమన్నారు. పార్లమెంట్ మార్చ్కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరియు సీజేపీ ప్రతిపాదించిన “చలో సంసద్” మార్చ్ నేపథ్యంలో జాతీయ రాజధాని వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్, పార్లమెంట్ మరియు ఇతర సున్నితమైన ప్రాంతాలతో సహా ఢిల్లీ వ్యాప్తంగా సుమారు 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.అలాగే న్యూఢిల్లీ జిల్లా పరిధిలో ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత’ (BNSS) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని ఢిల్లీ పోలీసులు ప్రజలను కోరారు.
ఈ నిరసన ప్రదర్శనల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) రాజధానిలోని ఐదు కీలక మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. రాజీవ్ చౌక్, జన్పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మరియు సేవా తీర్థ్ స్టేషన్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఐదు స్టేషన్లు మూసిఉంటాయని DMRC ఎక్స్లో పేర్కొంది.
