డిప్యూటీ సీఎం కేఈ కృష్టమూర్తి ఫ్యామిలీ చిక్కుల్లో పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి షాక్ తగిలింది. శ్యామ్బాబుకు డోన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. శ్యామ్బాబు సహా ఆస్పరి జెడ్పీటీసీ బొజ్జమ్మ, వెల్దుర్తి ఎస్సై నాగ ప్రసాద్లపై కోర్టు వారెంట్ జారీ అయ్యింది. వారిని హత్య కేసులో నిందితులుగా చేర్చి… అరెస్ట్ చేయాలని ఆదేశించింది. తన భర్తను కేఈ శ్యామ్బాబు తన అనుచరులతో కలిసి హత్య చేశారని… ఆయన్ను నిందితులుగా చేర్చలేదని భార్య శ్రీదేవి ఆరోపించారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి… శ్యామ్బాబు పేరు ఛార్జ్షీట్లో తొలగించారన్నారు. దీనిపై ఎస్పీని కూడా కలిసి ఫిర్యాదు చేశారు.
తన భర్త నారాయణరెడ్డితో పాటు మరో వ్యక్తిని అతి కిరాతకంగా హత్యచేసిన శ్యాంబాబు అనుచరులు అటు తరువాత పోలీసులపై ఒత్తిడి తెచ్చి చార్జీషీట్లో పేర్లు తొలగించుకోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం చేస్తూ… నిందితులుగా కేఈ శ్యాంబాబుతో పాటు ఆస్పరి జెడ్పీటీసీ కప్పెట్రాల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్ఐ నాగతులసీ ప్రసాద్లను తన భర్త హత్యకేసులో ముద్దాయిలుగా చేర్చాలని పేర్కొంటూ కర్నూలు జిల్లా డోన్ కోర్టులో శ్రీదేవి ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబు, బొజ్జమ్మ, వెల్దుర్తి ఎస్ఐ నాగప్రసాద్లను నిందితులుగా చేర్చాలని సూచించింది.
తర్వాత దీనిపై విచారణ జరిపి వారెంట్ జారీ చేసింది. నారాయణ రెడ్డి హత్య కేసులో శ్యామ్బాబుపై మొదటి నుంచి ఆరోపణలు వచ్చాయి. ఈ విమర్శలను కేఈ కృష్టమూర్తి ఖండించారు. ఈ కేసుతో సంబంధం లేదని చెప్పారు. కాని ఈలోపే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో శ్యామ్బాబు చిక్కుల్లో పడిపోయారు.