హైదరాబాద్ పరిధిలోని మియాపూర్ పోలీస్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ ను హత్య చేసి తల బొల్లారంలో.. మొండాన్ని మియాపూర్లో పడేశారు దుండగులు. హత్యకు గురైన ఆటో డ్రైవర్ ప్రవీణ్(24) గా గుర్తించారు.ఈ ఘటన గురువారం అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు తెలుస్తోంది.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం…గురువారం రాత్రి ప్రవీణ్(24) అనే ఆటో డ్రైవర్ను శ్రీను, శ్రీకాంత్లు మద్యం సేవించటానికి పిలిచారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దీప్తి శ్రీనగర్ ధర్మపురి క్షేత్రం వద్ద మరో వ్యక్తితో కలిసి నలుగురు మద్యం సేవించారు.
పూటుగా మద్యం సేవించిన తర్వాత పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని శ్రీను, శ్రీకాంత్లు ప్రవీణ్పై గొడవకు దిగారు. ముందుగా అనుకున్న ప్రకారం అతడ్ని హత్య చేశారు. అనంతరం తలను మొండెంనుంచి వేరుచేసి దూరంగా బొల్లారం చౌరస్తాలో పడేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తల, మొండాన్ని సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. హత్య కేసులో నిందితులైన శ్రీను, శ్రీకాంత్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.