పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ అదరగొట్టారు. ఒక్క ఓటు కూడా పోలవకుండానే 34 శాతం స్థానాలను కైవసం చేసుకొని దీదీ పవరేంటో మరోసారి నిరూపించారు. మే 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో 34 శాతం సీట్లు ఏకగ్రీవమయ్యాయి.
ఎన్నికల్లో ప్రత్యర్థి లేకపోవడంతో ఆ స్థానాల్లో సీఎం మమతా బెనర్జీ పార్టీ ఏకగ్రీవం అయ్యింది. ఇంత భారీ సంఖ్యలో పంచాయతీ సీట్లు ఏకగ్రీవం కావడం బెంగాల్ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం.
పశ్చిమ బెంగాల్లో మే 14న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 58,692 పంచాయతీ సీట్లు ఉండగా.. వీటిలో 20 వేలకు పైగా స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మినహా ఎవరూ పోటీలో లేరు. దీంతో ఆ స్థానాలన్నీ ఏకగ్రీవమయ్యాయి. కొందరు తమ నామినేషన్లను వెనక్కి తీసుకోవడం, మరికొందరి నామినేషన్లు సరిగ్గా లేకపోవడంతో తిరస్కరణకు గురవడం.. ఇలాంటి కారణాల వల్ల ఈ స్థానాల్లో ఎలాంటి పోటీ జరగట్లేదని ఎన్నికల అధికారులు తెలిపారు.