ప్రముఖ నటుడు హరికృష్ణ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన బావ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన తెలియగానే మంత్రి లోకేశ్ తో కలసి ఆయన హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్ లో ఘటనాస్థలానికి బయలుదేరారు. హరికృష్ణ మరణం తమ కుటుంబానికి తీరని లోటని తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా హరికృష్ణ మృతికి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సినీ రాజకీయాల్లో హరికృష్ణ చేసిన సేవలు మరువలేనివన్న కేసీఆర్, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
వైసీసీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికూడా హరికృష్ణమృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనకు షాక్కు గురిచేసిందని తెలిపారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
నందమూరి హరికృష్ణ హఠాన్మరణంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ , వైసీపీ ఎమ్మెల్యే రోజాదిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘హరికృష్ణ గారి మరణ వార్తతో ఎంతో ఆవేదనకు గురయ్యానని తెలిపారు.నందమూరి కుటుంబానికి సంతాపాన్ని తెలుపుతున్నా. ప్రియ సోదరులు తారక్, కల్యాణ్ రామ్, ఇతర కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి’ అంటూ ట్వీట్ చేశారు. వార్త తెలియగానే ఎంతో ఆవేదనకు గురయ్యానని రోజా చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.