హైదరాబాద్ కూకట్పల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రమ్య అనే ఇంటర్ విద్యార్థి రోడ్డు దాటుతుండగా చైతన్య కళాశాలకు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో రమ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో ఆగ్రహానికి గురైన తోటి విద్యార్థులు ఆగ్రహంతో ప్రమాదానికి కారణమైన బస్సుతో పాటు రోడ్డుపై వెళుతున్న శ్రీచైతన్య కాలేజీ బస్సులను ధ్వంసం చేశారు. శ్రీ చైతన్య కాలేజీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుతూ బస్సు నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ తోటి విద్యార్థులు ఆగ్రహించారు. కాలేజీ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళన కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపై నిలిచి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపు చేయటానికి విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.