తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘంలో ముసలం పుట్టింది. ఆ సంస్ధ గౌరవాధ్యక్షుడుగా ఉన్న దేవీ ప్రసాద్ ఆ పదవి నుంచి వెంటనే దిగిపోవాలని నిజామాబాద్ కు చెందిన పలువురు టిఎన్జీవో నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి టిఎన్జీవో బైలాలో గౌరవాధ్యక్షుడు అనే పదవే లేదని వారంటున్నారు.
ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉండి స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి తప్పుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని,ఆ తర్వాత మళ్లీ ఆ పదవిలోకి రావడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 30 వ తేదీలోగా దేవీ ప్రసాద్ పదవి నుంచి తప్పుకోవాలని లేకపోతే తామంతా నిరాహారదీక్షలు చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం సంఘంలోని ఇతర నాయకులు రాములు, పారిజాతం, విజయలక్ష్మిలతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు. అయితే గంగారాంను టిఎన్జీవో నుంచి తొలగించామని కేంద్ర సంఘం ప్రకటించడం కొసమెరుపు.